SGSTV NEWS online
Telangana

అడవి దున్న కోసం ముమ్మర గాలింపు

ఆత్మకూరు(ఎం): రెండు రోజులుగా ఆత్మకూరు(ఎం) మండలంలో  హడలెత్తిస్తున్న అడవి దున్న కోసం ఫారెస్ట్ అధికారులు, పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. గురువారం ఉదయం పల్లెర్ల గ్రామ సమీపంలోని పెసర్లబండ వద్ద జామాయిల్ తోటలో అడవి దున్నను గ్రామస్తులు చూసి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తులంతా అక్కడకు చేరుకుని అడవి దున్నను తరమడంతో రాఘవారం, నర్సాపురం, పల్లెర్ల గ్రామాల మధ్య ఓ వెంచర్ పక్కన చెట్ల పొదలోకి వెళ్లింది.



భువనగిరి జిల్లా ఫారెస్ట్ అధికారి పద్మజారాణి ఆధ్వర్యంలో చౌటుప్పల్, యాదగిరిగుట్ట, భువనగిరి రేంజ్ ఫారెస్ట్ అధికారులు గురువారం రాత్రి వరకు అడవి దున్న కోసం గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. తిరిగి శుక్రవారం డ్రోన్ కెమెరాలతో పాటు ఫారెస్ట్ అధికారులు, పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. వలిగొండ మండలం నర్సాపురం వైపు వెళ్లినట్లుగా కొందరు అనుమానిస్తున్నారు. రెండ్రోజులు అయినా అడవి దున్న ఆచూకీ తెలియకపోవడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Also read

Related posts