ఆయనో అధ్యాపకుడు.. పిల్లలకు చదువు చెప్పి దారి చూపే నిర్దేశకుడు. ఒంగోలు నుంచి అస్సాంకు వెళ్ళి అక్కడి విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అయితే విధి వక్రీకరించింది. తాను విద్యాబుద్ధులు నేర్పిన ఓ సైకో విద్యార్ది చేతిలో ఆ అధ్యాపకుడు హత్యకు గురయ్యాడు. క్లాస్రూంలోనే విద్యార్ది కత్తిపోట్లకు తాళలేక ప్రాణాలు విడిచాడు. అస్సాంలో జరిగిన ఈ దారుణ ఘటన యావత్ విద్యాలోకంలోనే కలవరం సృష్టించింది. తండ్రి చనిపోయినా కష్టపడి చదివి అస్సాంలో కళాశాల నడుపుతున్న ఒంగోలుకు చెందిన అధ్యాపకుడి కుటుంబంలో ఈ దారుణ ఘటన అంతులేని విషాదాన్ని నింపింది.
Also read :Athulya Ravi: హీరోయిన్ ఇంట్లో చోరీ.! అడ్డంగా దొరికిన దొంగ.. ఇద్దరు అరెస్ట్.!
అస్సాంలో దారుణం జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన రాజేష్ బాబు తాను నడుపుతున్న కళాశాలలోనే విద్యార్ధి చేతిలో కత్తిపోట్లకు గురై ప్రాణాలు విడిచాడు. ఒంగోలు నగరం అన్నవరప్పాడుకు చెందిన బెజవాడ రాజేష్ బాబు కెమిస్ట్రీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినా, మొక్కవోని ధైర్యంతో కష్టపడి చదవి కెమిస్ట్రీ లెక్చరర్గా జీవితం ప్రారంభించారు. విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు కళాశాలలో పదేళ్లు అద్యాపకుడిగా పనిచేశారు. అనంతరం తన స్నేహితులతో కలిసి అస్సాం రాష్ట్రంలోని శివసాగర్ ప్రాంతంలో సొంతంగా కళాశాల నెలకొల్పారు. ఆ కళాశాలకు తాను ప్రిన్సిపల్గా తన భార్య అపర్ణ డైరెక్టర్గా కళాశాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు..
Also read :పెళ్లికి ముందే నెల తప్పింది.. భర్తకు విషయం తెలియడంతో
వీరి కళాశాలకు అస్సాంలో మంచి పేరువచ్చింది. దీంతో పలు చోట్ల బ్రాంచ్లను కూడా ప్రారంభించారు. ఈ నేపధ్యంలో శివసాగర్ ప్రాంతంలోని కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ఓ విద్యార్థికి మాథ్స్లో మార్కులు తక్కువగా రావడంతో పాటు అతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో మ్యాథ్స్ లెక్చరర్ అతడ్ని మందలించారు. ఇంటికెళ్లి పెద్దలను తీసుకురావాలని సూచించారు. అదే సమయంలో ప్రిన్సిపల్ రాజేష్ బాబు కూడా అక్కడే ఉన్నారు. దీన్ని అవమానంగా భావించిన ఆ విద్యార్థి కక్ష పెంచుకున్నాడు. సాయంత్రం తన వెంట ఓ కత్తి తెచ్చుకుని క్లాస్రూంలో కూర్చున్నాడు. తల్లిదండ్రులను తీసుకురమ్మంటే ఎందుకు తీసుకురాలేదని రాజేష్ బాబు ఆ విద్యార్దిని ప్రశ్నించడంతో ఒక్కసారిగా ఉన్మాదిగా మారిన ఆ విద్యార్ధి రాజేష్ బాబుపై దాడి చేశాడు. తనవెంట తెచ్చుకున్న కత్తితో విరుచుకుపడ్డాడు. అందరూ చూస్తుండగానే క్లాస్ రూంలో కత్తితో ఆరుసార్లు పొడిచాడు.
Also read :Andhra Pradesh: చీపురు, తాపీ చేతపట్టిన పెద్దాసుపత్రి సూపరింటిండెంట్.. ఎందుకో తెలుసా..?
రాజేష్ బాబు తల, ఛాతీపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తేరుకున్న కాలేజీ సిబ్బంది రాజేష్ బాబును సమీప ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. రాజేష్ బాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జూలై మాసంలో పిల్లలకు శెలవులు కావడంతో భార్య, పిల్లలు రెండు రోజుల క్రితమే ఒంగోలుకు వచ్చారు. రాజేష్ బాబు మూడురోజుల తరువాత ఒంగోలుకు రావాల్సి ఉంది. కుటుంబ సభ్యులతో ప్రతి ఏడాది జూలై మాసంలో ఒంగోలులో సరదాగా గడిపే అలవాటు ఉండటంతో అంతా రాజేష్ బాబు కోసం ఎదురు చూస్తుండగా, ఆయన హత్యకు గురయ్యారని పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చిందిన ఆయన భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Also read :Lady Producer: టాలీవుడ్లో దారుణం.. కుళ్లిన స్థితిలో లేడీ ప్రొడ్యూసర్ శవం.!
విద్యార్దులకు చదువు చెప్పడమే నేరమైందని, కేవలం చదువుకోవడం లేదని మందలించినందుకే చంపేస్తారా..? అంటూ రాజేష్ బాబు భార్య కన్నీటిపర్యంతమవుతున్నారు. విద్యార్ధుల మానసిక పరిస్థితి విపరీతంగా మారడానికి తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా ఒక కారణంగా కనిపిస్తుందంటున్నారు. విద్యార్దులు ఎప్పుడు ఏం చేస్తున్నారు, చదువుతున్నారా.. లేదా… అన్న విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారికి మంచి చెడుల గురించి తల్లిండ్రులు చెప్పాల్సిన అవసరం ఉందంటున్నారు.
ఒంగోలు నుంచి 20 ఏళ్లుగా అస్సాం రాష్ట్రంలోని గౌహతికి వెళ్ళి అక్కడ కళాశాల ఏర్పాటు చేసుకుని రాజేష్ బాబు విద్యాబోధన చేస్తున్నారు. తన భార్యతో కలిసి కళాశాలను నడుపుతున్నారు. కళాశాలకు మంచి పేరు రావడంతో అస్సాంలోని మరో ప్రాంతం శివసాగర్ లో మరో బ్రాంచ్ ఏర్పాటు చేశారు. అంతా మంచిగా సెటిల్ అయ్యారనుకుంటున్న సమయంలో విద్యార్ది చేతిలో రాజేష్ బాబు హత్యకు గురయ్యారని తెలిసిందని ఒంగోలులోని బందువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హత్య చేసిన విద్యార్ది మైనర్ కావడంతో తమకు న్యాయం జరుగుతుందా… లేదా… అన్న ఆందోళన ఉందని, అయితే అక్కడి పోలీసులు, కళాశాల సిబ్బంది తమ కుటుంబానికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారని తెలిపారు. మరోవైపు ప్రతిఏటా జూలై మాసంలో ఒంగోలుకు వచ్చే రాజేష్ బాబు, ఈసారి తన భార్య, పిల్లలను ముందుగానే పంపించి తాను మాత్రం మరో మూడు రోజుల్లో వస్తానని తెలిపారని, అయితే ఇంతలో ఆయన మృతదేహం రావడం తమను అంతులేని విషాదాన్ని మిగిల్చిందని కన్నీటిపర్యంతమవుతున్నారు.
Also read :తొలుత ప్రమాదం అనుకున్నారు.. కానీ తల్లిదండ్రుల అనుమానమే నిజమైంది..
రాజేష్ బాబు కుటుంబానికి జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదంటే హత్య చేసిన విద్యార్ది మైనర్ కావడంతో శిక్ష నుంచి తప్పించుకోకూడదని కోరుతున్నారు. ఆ కుటుంబంలో పిల్లలకు తల్లిదండ్రులను లేకుండా చేసిన ఆ విద్యార్దిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. చిన్నతనంలోనే తండ్రి చనిపోయినా కష్టపడి ఎదిగి అస్సాం లాంటి రాష్ట్రాల్లో విద్యార్ధులను మంచిగా తయారు చేయాలని కోరుకుంటూ విద్యాసంస్థలను రాజేష్ బాబు స్థాపించారని బంధువులు గుర్తు చేసుకుంటున్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో స్కాలర్ షిప్తో చదువుకుంటూ తమ కుటుంబానికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి రాజేష్ బాబుకు అస్సాం ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఇదిలావుంటే, క్లాస్రూంలో లెక్చరర్ రాజేష్ బాబును కత్తితో పొడిచి హత్య చేసిన విద్యార్ధి, అనంతరం ఎలాంటి బెరుకు లేకుండా ప్రిన్సిపల్ కుర్చీలో కూర్చుని ఫేస్బుక్ ఆన్లైన్లో మాట్లాడినట్టు గుర్తించారు. ఇలాంటి సైకో లక్షణాలు ఉన్న ఆ విద్యార్దికి తండ్రి చనిపోయాడని, అతనికి కూడా నేరచరిత్ర ఉందని తెలిసిందని రాజేష్ బాబు బంధువులు చెబుతున్నారు. ఇలాంటి సైకో లక్షణాలు ఉన్న విద్యార్దులను తల్లిదండ్రులు గుర్తించి జాగ్రత్తగా మసలుకుంటూ వారిని సరైన మార్గంలో పెడితే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని కోరుకుంటున్నారు.
Also read :మరికొన్ని రోజుల్లో వివాహం.. కన్నవాళ్ల మాటకి ఎదురు చెప్పలేక
అస్సాంలో రాజేష్ బాబు హత్యకు గురయ్యారన్న సమాచారం తెలుసుకున్న ఒంగోలులోని అతని బంధువులు, స్నేహితులు తీవ్రంగా మదనపడుతున్నారు. చిన్నతనం నుంచి రాజేష్ బాబుతో కలిసి చదువుకున్న స్నేహితులు అతను ఎంతో మంచివాడని, అలాంటి వ్యక్తి కుటుంబానికి ఇలా జరగడం ఎంతో బాధగా ఉందంటున్నారు. తండ్రి చనిపోయినా ఎంతో ధైర్యంగా ఎదిగి ఈ స్ధాయికి వచ్చిన రాజేష్ బాబు కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు
Also read :మా ఇంట్లో చెట్టుకు పండు కోస్తావా…? దళిత బాలుడిపై ప్రభుత్వ రిటైర్డ్ టీచర్ దాష్టీకం..