జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్కి సంబంధించిన మరో వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య, ముంబైలోని నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఘటనలో ప్రధాన సూత్రధారి అయిన బిష్ణోయ్ గుజరాత్లోని అహ్మదాబాద్లోని సబర్మతి సెంట్రల్ జైలులో గత ఏడాది ఆగస్టు నుంచి రిమాండ్లో ఉన్నాడు. అయితే అక్కడి జైలు నుంచి 19 సెకన్ల వీడియోలో ఈద్ గురించి..
అహ్మదాబాద్, జూన్ 19: జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్కి సంబంధించిన మరో వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య, ముంబైలోని నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఘటనలో ప్రధాన సూత్రధారి అయిన బిష్ణోయ్ గుజరాత్లోని అహ్మదాబాద్లోని సబర్మతి సెంట్రల్ జైలులో గత ఏడాది ఆగస్టు నుంచి రిమాండ్లో ఉన్నాడు. అయితే అక్కడి జైలు నుంచి 19 సెకన్ల వీడియోలో ఈద్ గురించి పాకిస్తానీ గ్యాంగ్స్టర్ షాజాద్ భట్టితో మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ వీడియోలో అతను ఈద్ సందర్భంగా పాకిస్థాన్ గ్యాంగ్స్టర్కు శుభాకాంక్షలు చెబుతున్నట్లు కనిపించింది. అంతేకాదు మరుసటి రోజు మళ్లీ కాల్ చేస్తానని వీడియోలో చెప్పడం కనిపిస్తుంది. ఈ వీడియో వైరల్ కావడంతో దానిపై గుజరాత్ ప్రభుత్వం మంగళవారం విచారణకు ఆదేశించింది.
తాజా వీడియోపై శిరోమణి అకాలీదళ్ నేత, పంజాబ్ మాజీ మంత్రి బిక్రమ్ సింగ్ మజిథియా తీవ్రంగా స్పందించారు. జైలు నుంచి కూడా ఇలా స్వేచ్ఛగా పాకిస్థాన్ గ్యాంగ్స్టర్లతో మాట్లాడటాన్ని చంఢీగఢ్ శిరోమణి అకాలీదళ్ నేత బిక్రమ్ సింగ్ మజిత తప్పుబట్టారు. గ్యాంగ్స్టర్లు నిర్బంధంలో ఉన్నప్పుడు కూడా తమ కార్యకలాపాలు యదేచ్ఛగా నిర్వహించడం ప్రజల భద్రతకు పెనుముప్పు కలిగిస్తాయని మండిపడ్డారు.
కాగా గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్పై ఇప్పటికే పలు కేసులు నమోదై ఉన్నాయి. వాటిల్లో దేశ సరిహద్దుల్లో డ్రగ్ స్మగ్లింగ్, పంజాబ్ గాయకుడు మూసేవా మర్డర్ (2022) కేసుల్లో లారెన్స్ నిందితుడుగా ఉన్నాడు. ఏప్రిల్లో నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన ఘటనలో కూడా బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయముందని పోలీసులు తెలిపారు. సరిహద్దు డ్రగ్ స్మగ్లింగ్ కేసులో అతని పాత్రపై విచారించేందుకు గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) బిష్ణోయ్ను ఆగస్టు 2023లో అహ్మదాబాద్కు తీసుకువచ్చింది. రిమాండ్ ముగియడంతో జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అయితే 2023 మార్చిలో బిష్ణోయ్ జైలులో ఉండగా ఓ న్యూస్ ఛానెల్కి రెండు బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఈ వీడియో అప్పట్లో పెను సంచలనంగా మారింది. దీనిపై పంజాబ్ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు కూడా. ఈ కేసు దర్యాప్తుకు సిట్ను ఏర్పాటు చేసినా.. ఇంతవరకు ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం. ఇప్పుడు మళ్లీ రెండో మారు అతడి వీడియో జైలు నుంచి బయటకు రావడం గుజరాత్ లో సంచలనంగా మారింది.