కర్ణాటక నుంచి హైదరాబాద్ కు భారీగా తరలిస్తున్న నకిలీ కరెన్సీ పట్టుబడిన సంఘటన మంగళవారం శంషాబాద్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
శంషాబాద్, : కర్ణాటక నుంచి హైదరాబాద్ కు భారీగా తరలిస్తున్న నకిలీ కరెన్సీ పట్టుబడిన సంఘటన మంగళవారం శంషాబాద్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని కొప్పల్ తాలుకా హోసలింగాపురకు చెందిన కొరచ మురుగేష్ జిరాక్స్ దుకాణం నిర్వహిస్తున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించాలన్నా ఆశతో కొంత కాలంగా సోదరుడు రవిచంద్ర, అతడి కుమారుడు యోగేష్లతో కలిసి తన జిరాక్స్ దుకాణంలో నకిలీ నోట్లను తయారు చేసి హైదరాబాద్కు తరలిస్తున్నాడు. ఈ క్రమంలోనే మురుగేష్ రూ.18 లక్షల విలువైన నకిలీ నోట్ల కట్టలను ఓ సంచిలో వేసుకుని నామఫలకం లేని ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ బయల్దేరాడు. తొండుపల్లి వద్దకు రాగానే జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులను గమనించి మురుగేష్ బైక్ వేగాన్ని పెంచాడు. అనుమానం వచ్చిన ఎస్సై భాస్కర్రావు, సిబ్బంది మురుగేష్ను వెంబడించి పట్టుకుని తనిఖీ చేయగా నకిలీ నోట్ల తయారీ గుట్టురట్టయింది. మురుగేష్ను అరెస్టు చేసి అతడి నుంచి రూ18 లక్షల విలువైన నకిలీ నోట్లు, రూ.6,500 నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
.